ముంబై, సెప్టెంబర్ 24, 2025: భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అక్టోబర్ 4, 2025 నుంచి చెక్ల క్లియరింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ప్రస్తుతం 2 వర్కింగ్ డేస్లు పట్టే చెక్ క్లియరెన్స్ ప్రక్రియను కొన్ని గంటల్లో పూర్తి చేయడానికి ఈ కొత్త వ్యవస్థ ఉపయోగపడుతుంది. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)ను బ్యాచ్ ప్రాసెసింగ్ నుంచి కంటిన్యూస్ క్లియరింగ్ & సెటిల్మెంట్ ఆన్ రియలైజేషన్కు మార్చడంతో కస్టమర్లకు మరింత సౌకర్యం, బ్యాంకులకు సెటిల్మెంట్ రిస్క్ తగ్గుదల కలుగుతాయని ఆర్బీఐ పేర్కొంది. ఈ మార్పులు రెండు దశల్లో అమలు చేస్తారు. మొదటి దశ అక్టోబర్ 4 నుంచి, రెండవ దశ జనవరి 3, 2026 నుంచి ప్రారంభం కానుంది.
కొత్త వ్యవస్థ ఎలా పని చేస్తుంది..?
ప్రస్తుత సీటీఎస్ వ్యవస్థలో చెక్లు బ్యాచ్లలో స్కాన్ చేసి, 1 లేదా 2 వర్కింగ్ డేస్ల్లో (టీ+1 సైకిల్) క్లియర్ అవుతాయి. కానీ కొత్త వ్యవస్థలో బిజినెస్ అవర్స్ (ఉద: 10 ఏఎం నుంచి 4 పీఎం వరకు)లో చెక్లు కంటిన్యూస్గా స్కాన్ చేసి, ప్రెజెంట్ చేసి, సెటిల్ చేస్తారు. ప్రతి చెక్కు డ్రావీ బ్యాంక్ పాజిటివ్ (అప్రూవ్) లేదా నెగటివ్ (డిస్ఆనర్) కన్ఫర్మేషన్ ఇస్తుంది.
- ఫేజ్ 1 (అక్టోబర్ 4, 2025 – జనవరి 2, 2026): చెక్లు 10 ఏఎం నుంచి 4 పీఎం వరకు కంటిన్యూస్గా ప్రెజెంట్ చేస్తారు. డ్రావీ బ్యాంక్లు 7 పీఎం వరకు కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేయకపోతే అటోమేటిక్గా అప్రూవ్ అవుతాయి మరియు ఆ రోజు సెటిల్మెంట్లో చేరుతాయి.
- ఫేజ్ 2 (జనవరి 3, 2026 నుంచి): చెక్లకు ‘ఐటమ్ ఎక్స్పైరీ టైమ్’ (టీ+3 క్లియర్ అవర్స్) వస్తుంది. ఉదాహరణకు, 10 ఏఎం – 11 ఏఎం మధ్య వచ్చిన చెక్లు 2 పీఎం వరకు కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేయకపోతే అప్రూవ్ అవుతాయి. సెటిల్మెంట్ తర్వాత ప్రెజెంటింగ్ బ్యాంక్ 1 గంటలోపు కస్టమర్ అకౌంట్లో డబ్బు క్రెడిట్ చేయాలి (సాధారణ చెక్లతో).
సెటిల్మెంట్ పూర్తయిన తర్వాత క్లియరింగ్ హౌస్ ప్రెజెంటింగ్ బ్యాంక్కు కన్ఫర్మేషన్ పంపుతుంది. ఈ మార్పులతో చెక్ క్లియరెన్స్ NEFT, RTGS వంటి డిజిటల్ పేమెంట్ల వేగానికి సమానంగా మారుతుంది.
ఈ మార్పుల ప్రయోజనాలు.. కస్టమర్లు, బ్యాంకులకు ఎలాంటి మేలు?
ఈ కొత్త వ్యవస్థ చెక్లపై ఆధారపడే వ్యాపారులు, వ్యక్తులకు గొప్ప సౌకర్యం. డబ్బు త్వరగా అందడంతో క్యాష్ ఫ్లో మెరుగుపడుతుంది. బ్యాంకులకు సెటిల్మెంట్ రిస్క్ తగ్గుతుంది, ట్రాన్సాక్షన్ ఎఫిషియెన్సీ పెరుగుతుంది. UPI, NEFT వంటి డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్నప్పటికీ, చెక్లు ఇంకా వాడుకలో ఉన్నాయి. ఈ మార్పు వాటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆర్బీఐ బ్యాంకులకు వ్యవస్థలు సిద్ధం చేసుకోవాలని, కస్టమర్లకు కొత్త టైమ్లైన్ల గురించి తెలియజేయాలని ఆదేశించింది. ఈ మార్పులు భారత బ్యాంకింగ్ వ్యవస్థను మరింత డిజిటల్, వేగవంతంగా మార్చడంలో మైలురాయిగా నిలుస్తాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
